రేపు తప్పు చేస్తే.. విశాఖను కాపాడుకోవడం కష్టం: సబ్బం హరి

  • కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలి
  • ఓటర్లు లొంగిపోతే వైసీపీ అరాచకాలకు అంతు ఉండదు
  • విశాఖ నగరాన్ని అందరూ కాపాడుకోవాలి
రేపు జరగనున్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు తప్పు చేస్తే విశాఖను ఎప్పటికీ కాపాడుకోలేమని నగర ప్రజలను మాజీ ఎంపీ సబ్బం హరి హెచ్చరించారు. ఒక కులానికో, డబ్బుకో, మరేదానికో లొంగిపోతే... వైసీపీ నేతలు రెచ్చిపోతారని అన్నారు. ఎవరూ మాట్లాడటానికి వీల్లేదన్నట్టుగా ప్రవర్తిస్తారని, వారి అరాచకాలకు అంతు ఉండదని చెప్పారు. ప్రజలంతా మళ్లీ తనకే ఓటు వేశారని జగన్ భావిస్తారని... స్టీల్ ప్లాంట్ అమ్మేసినా, పోలవరం ఎత్తు తగ్గించినా, ఏం చేసినా తమకు ఏం కాదనే ధోరణిలో పాలిస్తారని అన్నారు.

రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెలువరించాలని చెప్పారు. రేపటి అవకాశాన్ని వదులుకుంటే... విశాఖను రక్షించుకోవడం అసాధ్యమని అన్నారు. ఓటర్ల తీర్పు పాలకులకు కనువిప్పు కావాలని చెప్పారు. రేపు తప్పు చేస్తే... ఆ తర్వాత ఎంత బాధ పడినా ఉపయోగం లేదని అన్నారు. విశాఖ నగరాన్ని కాపాడుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నానని చెప్పారు.

Sabbam Hari
Vizag
YSRCP
Municipal Elections

More Telugu News